పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో ముగ్గురికి కోర్టు జరిమానా
- VOICE OF HERALD

- Aug 4
- 1 min read
పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో ముగ్గురికి కోర్టు జరిమానా

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
విధి నిర్వహణలో ఉన్న పోలీసును అడ్డగించి బెదిరించిన ముగ్గురికి కోర్టు జరిమానా విధించింది. 07.06.2021 నాడు ప్రొద్దుటూరు గాంధీ బొమ్మ వద్ద డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ చింతల ఉదయ్ కుమార్ ను షైక్ హుస్సేన్, షైక్ అబ్దుల్ అలీమ్, షైక్ నాయబ్ రసూల్ అనే ముగ్గురు మోటార్ సైకిల్ తో అడ్డగించారు. చిన్న గొడవలో సర్ది చెప్పినందుకు కక్ష పెట్టుకుని నానా బూతులు తిట్టి, "అంతు చూస్తామని" బెదిరించారు. ఈ మేరకు అప్పటి ఎస్ఐ జె. శివశంకర్ ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నందు Cr. No. 224/2021 U/s 341, 353 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసును ఒకటవ అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించింది. నేరం రుజువైనందున ముగ్గురు ముద్దాయిలకు ఒక్కొక్కరికి రూ. 5,500 చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో 3 నెలలు జైలు శిక్ష అని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో ప్రభుత్వ ప్లీడర్ శ్రీమతి స్వప్న వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఏ ఎస్ పి విభూ కృష్ణ ఐపీఎస్, ఒకటో పట్టణ సీఐ కొండా రెడ్డి మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు చేసినా, ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.




Comments