top of page

రాజారెడ్డి మృతి వెనుక విస్తుపోయే నిజాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 14, 2023
  • 1 min read

రాజారెడ్డి మిస్టీరియస్ మర్డర్ ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ ప్రేరణ కుమార్ ఐపిఎస్

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


పూజ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ,డాడీ హోమ్ అనాధ శరణాలయం వ్యవస్థాపకుడు రాజారెడ్డి మృతి మిస్టరీని పోలీసులు చేదించారు.ఈ నెల 11వ తేదీ రాత్రి పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో రాజారెడ్డి పడి ఉండటానికి గమనించి రాజారెడ్డి తమ్ముడు శ్రీధర్ రెడ్డి, భార్య ప్రసన్న, స్కూలు సిబ్బంది కొంతమంది కలిసి రాజారెడ్డిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ రాజారెడ్డిని పరీక్షించిన ప్రభుత్వ డాక్టర్ వీరనాద్ రెడ్డి రాజారెడ్డి గుండెపోటుతో మృతి చెందాడని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం రాజారెడ్డి, మృతదేహానికి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బాడీని బంధువులకు అప్పచెప్పారు. అయితే రాజారెడ్డి శరీరంపై రక్తపు గాయాలు ఉండటంతో రాజారెడ్డి సన్నిహితులు కొందరు జిల్లా కలెక్టర్ జిల్లా, ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లడంతో ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో రాజారెడ్డి మృతదేహానికి రిపోస్టు మార్టం చేయాలని ఆదేశించారు. దీంతో రాజారెడ్డి మృతదేహానికి అదే రోజు మరొకసారి ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేరణకుమార్, జమ్మలమడుగు డిఎస్పి నాగరాజు ఆధ్వర్యంలో కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు రాజారెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఆయన తమ్ముడు శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు .

ఈ విచారణలో పోలీసులకు విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాజారెడ్డి ట్రస్ట్ కు సంబంధించిన ఆస్తుల విషయమై కొద్ది రోజులుగా రాజారెడ్డికి అతను తమ్ముడు శ్రీధర్ రెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. రాజారెడ్డికి వివాహం కాకపోవడంతో ట్రస్ట్ కు సంబంధించిన వ్యవహారాలు, ఆస్తులు తమకు బదలాయించాలని తమ్ముడు శ్రీధర్ రెడ్డి కోరగా అందుకు రాజారెడ్డి నిరాకరించాడు. అంతేకాకుండా పూజ ఇంటర్నేషనల్ స్కూలుకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న రాజా రెడ్డి తమ్ముడి భార్య ప్రసన్న ను నెలరోజుల క్రితం ప్రిన్సిపల్ గా రాజారెడ్డి తొలగించాడు. దీంతో రాజారెడ్డి పై కోపం పెంచుకున్న శ్రీధర్ రెడ్డి, అతని భార్య ప్రసన్న కలిసి గత కొద్ది రోజులుగా రాజారెడ్డిని హత్య చేయడానికి పథకం వేసినట్లు అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈనెల 11వ తేదీ రాత్రి పూజా టెక్నో స్కూల్ లో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో అప్పటికే ముందస్తుగా అనుకున్న ప్రకారం రాజారెడ్డిని తమ్ముడు శ్రీధర్ రెడ్డి, మరొక ఇద్దరు యువకులు సుభాన్ శివ కలిసి ఒకసారిగా రాజారెడ్డి పై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేసినట్లు అడిషనల్ ఎస్పీ ప్రేరణకుమార్ తెలిపారు. రాజారెడ్డి హత్య కేసులో ఐదు మందిపై హత్య కేసు నమోదు చేశామని ఇంకా విచారణ కొనసాగిస్తున్నామని అడిషనల్ ఎస్పీ ప్రేరణకుమార్ మీడియాకు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page