ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధి నా ధ్యేయం - మున్సిపల్ కమిషనర్
- VOICE OF HERALD

- Aug 3
- 1 min read
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధి నా ధ్యేయం - మున్సిపల్ కమిషనర్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. శ్రీనివాస్ విశ్వనాథ్ సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలోని ఆయన చాంబర్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా తాను పనిచేస్తానని, ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన పట్టణంలోని ప్రధాన మురుగు కాలువలలో పూడిక తీత పనులు చేపట్టడంతోపాటు ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా ప్రొద్దుటూరును తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 'స్వచ్ఛ సంకల్ప దీక్ష' చేపట్టి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పలు ప్రక్షాళనలు చేపడతామని, ఇందులో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ ఎక్కడా కూడా అవినీతి జరగకుండా, మౌలిక వసతుల కల్పనలో అసౌకర్యం కలగకుండా పనులు సాఫీగా జరిగేలా శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి మున్సిపాలిటీపై చేసిన అవినీతి ఆరోపణలపై ఆయన స్పందించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరోపణలపై స్పందించి ఆయన ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత సిబ్బందిని మరో శాఖకు తాత్కాలిక బదిలీ చేసినట్టు, ఈ విషయంపై తాను ఎంక్వైరీ కి ఆదేశించినట్లు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది ఎక్కడైనా చేతివాటం ప్రదర్శిస్తే తన దృష్టికి తీసుకొని రావాలని, తన పేరు చెప్పి కానీ తనపై ఆరోపణలు ఉంటే ఏసీబీ ని కూడా ఆశ్రయించవచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం పై రానున్న రోజుల్లో యుద్ధప్రాతిపదికన పనులు ముందుకు సాగేలా ప్రణాళిక రచించినట్లు తెలిపిన ఆయన ప్రతి సోమవారం డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని వారి సమస్యలను తమ దృష్టికి తీసుకుని రావాలని అన్నారు.





Comments