తెరపైకి మైదుకూరు రోడ్డు పనులపై రాజకీయ విమర్శలు
- VOICE OF HERALD

- Jul 10
- 1 min read
తెరపైకి మైదుకూరు రోడ్డు పనులపై రాజకీయ విమర్శలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా ప్రొద్దుటూరులో మైదుకూరు రోడ్డు నిర్మాణ పనులపై రాజకీయ విమర్శలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన రోడ్డు పనులను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరిశీలించి, పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని ఆరోపించారు.
ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తనయుడు కొండారెడ్డి రూ.5 కోట్ల వ్యయంతో చేపడుతున్న 580 మీటర్ల రోడ్డు నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే తనయుడు కొండారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనుల్లో పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రోడ్డు విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న కాలువలను సక్రమంగా నిర్మించకుండా ఇష్టానుసారంగా మలుపులు తిప్పారని, కొంతమంది భవన యజమానుల నుంచి డబ్బులు తీసుకుని కాలువల నిర్మాణాన్ని మార్చారని విమర్శించారు. సింగిల్ టెండర్ ద్వారా 4.95 శాతం అదనపు కోట్తో పనులు దక్కించుకున్నారని, ప్రస్తుతం జరుగుతున్న పనులు నాసిరకంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
గతంలో నాసిరకం పనులు జరిగితే విజిలెన్స్కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చెప్పారని గుర్తు చేసిన రాచమల్లు, ఇప్పుడు అదే ప్రమాణాలను ఈ పనులపై కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేశామని, మున్సిపాలిటీలో చేపట్టిన 1165 అభివృద్ధి పనులు తక్కువ టెండర్లతో నాణ్యతగా పూర్తి చేశామని తెలిపారు. ఆ పనులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు కూడా నాణ్యత బాగుందని నివేదిక ఇచ్చారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.




Comments