రక్తదానంతో మానవత్వాన్ని చాటిన బి. మోహన్
- VOICE OF HERALD

- 5 days ago
- 1 min read
రక్తదానంతో మానవత్వాన్ని చాటిన బి. మోహన్ - వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మానవత్వం చాటిన యువకుడు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
జమ్మలమడుగు నియోజకవర్గం మోరగుడి గ్రామానికి చెందిన 47 ఏళ్ల పి. పార్వతి లివర్ సంబంధిత రుగ్మతతో తీవ్రంగా బాధపడుతున్నారు. వైద్యులు పరీక్షించగా ఆమె శరీరంలో రక్తం శాతం కేవలం 4 పాయింట్లు మాత్రమే ఉందని, ఇది ప్రాణానికి ప్రమాదమని తెలిపారు. వెంటనే ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులోని అనంత క్లినిక్లో ఆమెను చికిత్స నిమిత్తం చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న సుధీర్ అనే యువకుడు డొక్కా సీతమ్మ అన్నదాన చారిటబుల్ అండ్ బ్లడ్ డోనర్స్ ప్రెసిడెంట్ నల్లంశెట్టి రామ్ మనోజ్ కుమార్ ను సంప్రదించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం అందుకున్న ప్రొద్దుటూరు స్థానిక బిఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ డిస్ట్రిబ్యూటర్ బి. మోహన్ అనే యువకుడు తక్షణం స్పందించి పార్వతికి రక్తదానం చేశారు. రక్తం అందడంతో పార్వతి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సహాయానికి పార్వతి కుటుంబ సభ్యులు రక్తదాత బి. మోహన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు
ఒకరి రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. ప్రతి 2 సెకన్లకు ఎవరో ఒకరికి రక్తం అవసరం అవుతుంది. రక్తదానం చేయడం వల్ల దాతకు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తదానం వల్ల శరీరంలో కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది, శరీరంలోని ఇనుము స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. అంతేకాకుండా రక్తదానానికి ముందు జరిగే ఉచిత ఆరోగ్య పరీక్షల ద్వారా మన ఆరోగ్య స్థితి కూడా తెలుసుకోవచ్చు. "రక్తదానం - ప్రాణదానం" అన్నట్లు, మోహన్ లాంటి యువకుల చొరవతో సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన రుజువు చేసింది.



Comments