మోడల్ పాఠశాలల అభివృద్ధి పనులు చక్కటి ప్రణాళికతో చేపట్టాలి - జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
- EDITOR

- Jun 24
- 1 min read
మోడల్ పాఠశాలల అభివృద్ధి పనులు చక్కటి ప్రణాళికతో చేపట్టాలి - జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప, జూన్ 24: జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన.. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టనున్న పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మోడల్ పాఠశాలల అభివృద్ధి పనులకు సంబంధించి సమగ్ర ప్రణాళిక నివేదికలను సిద్ధం చేసి పనులను చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఎంపిక చేసిన 396 పాఠశాలల్లో అభివృద్ధి పనులన్నీ మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించాలని తెలిపారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పురపాలక మరియు గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖల అధికారుల సమన్వయంతో పనులను అమలు చేయాలన్నారు.
మోడల్ పాఠశాలలుగా గుర్తింపు పొందే పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్తమ మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన వసతులు, అభివృద్ధి అవసరాలపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.
మండల స్థాయి కమిటీలలో ఎంఈఓ-1, ఎంఈఓ-2లు, ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా పనులు నిర్వహించాలని తెలిపారు. రెండో దశ “మన బడి – మన భవిష్యత్తు” కార్యక్రమంలో పెండింగ్లో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేసి నాణ్యతను కాపాడాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో సమగ్ర శిక్ష అభియాన్ అదనపు పథక సమన్వయకర్త అనురాధ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రధాన ఇంజినీరు ఏడుకొండలు, కడప పురపాలక సంస్థ ప్రధాన ఇంజినీరు చెన్నకేశవరెడ్డి, ఉప జిల్లా వ్యవసాయ అధికారి రాజగోపాల్ రెడ్డి, ఎంఈఓలు, మున్సిపల్, పీఆర్ ఇంజినీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




Comments