top of page

రాచమల్లు వ్యాఖ్యలు వాస్తవాలకు దూరం.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు : టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 20
  • 1 min read

రాచమల్లు వ్యాఖ్యలు వాస్తవాలకు దూరం.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు : టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా

పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జెబిఉల్లా
పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జెబిఉల్లా

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రతి రోజూ రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని జబీవుల్లా అన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు, ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలకు ఎలాంటి పొంతన లేదని విమర్శించారు.


జగన్‌మోహన్ రెడ్డిని సమర్థిస్తూ మాట్లాడుతున్న రాచమల్లు, గతంలో సీబీఐ, సుప్రీంకోర్టు దేశంలో అత్యుత్తమ దర్యాప్తు, న్యాయ వ్యవస్థలని చెప్పారని, అదే సంస్థలు జగన్‌ను ఆర్థిక నేరాల కేసుల్లో నిందితుడిగా పేర్కొన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు.


గతంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తన రాజకీయ గురువని, బలమైన నాయకుడని చెప్పిన రాచమల్లు, ఇప్పుడు ఆయన వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యానించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. కాంట్రాక్టర్లపై రాచమల్లు చేస్తున్న ఆరోపణలను ఖండించిన జబీవుల్లా, ఏ పేరుతో తీసుకున్నా అది లంచమేనని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకుని, తర్వాత నాసిరకం పనులంటూ విమర్శించడం రాచమల్లు రాజకీయ శైలిగా మారిందని విమర్శించారు.


రాచమల్లు మాట్లాడే భాష వల్లే ప్రొద్దుటూరు ప్రతిష్ఠ దెబ్బతింటోందని, గతంలో తన నాయకుడిని ఎవరైనా విమర్శిస్తే రాజమండ్రికి వెళ్తానని చెప్పిన ఆయన, ఇప్పుడు తనపై వస్తున్న విమర్శలకు కూడా అదే విధంగా స్పందిస్తారా అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో అభివృద్ధి, రోడ్లు, సంక్షేమం, శాంతిభద్రతలు ప్రస్తుతం గత వైఎస్సార్‌సీపీ పాలన కంటే మెరుగ్గా ఉన్నాయని జబీవుల్లా పేర్కొన్నారు. జగనన్న ఇళ్ల అంశం, టీడీపీ ఆజెండా అంశాలపై గతంలో చేసిన వ్యాఖ్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఇప్పటికే తమ తీర్పు చెప్పారని గుర్తుచేశారు.


ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని రాచమల్లుకు సూచించిన జబీవుల్లా, వివేకానంద రెడ్డి హత్య కేసు, నందం సుబ్బయ్య హత్య కేసుపై కూడా ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహించేందుకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page