top of page

ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి, మినీ మహానాడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 28, 2024
  • 1 min read

ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి, మినీ మహానాడు

కేక్ కట్ చేస్తున్న టిడిపి నాయకులు

ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు నిలిచి ఉన్నారనటం ఏమాత్రం సందేహం లేదు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవలను గుర్తు చేసుకుంటారు టిడిపి నాయకులు, అభిమానులు. గతేడాది తారక రామారావు శత జయంతి వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు, అలాగే మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం భారీ కేక్ కట్ చేశారు. ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మల్యే అభ్యర్థిగా నంద్యాల వరదరాజుల రెడ్డి గెలిచిన పక్షంలో ప్రొద్దుటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు కృషి, కుందు పెన్నా కాలువల మిగులు పనులు పూర్తి చేయాలని, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పరిశ్రమలు ఏర్పాటు, తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తూ పార్టీ అభ్యున్నతి కోసం పనిచేయని వారిని పార్టీ నుండి బహిష్కరించాలంటూ మినీ మహానాడులో పలు తీర్మానాలు చేశారు. వక్తలు మాట్లాడుతూ, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని కొనియాడారు.

కార్యక్రమంలో నంద్యాల వరదరాజుల రెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యదర్శి నంద్యాల కొండా రెడ్డి, సీఎం సురేష్ నాయుడు, వి ఎస్ ముక్తియార్, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురాంరెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జబీవుల్లా, ప్రొద్దుటూరు మండల కన్వీనర్ బోడేల బాబుల్ రెడ్డి, కౌన్సిలర్లు మురళీధర్ రెడ్డి, మునీర్, మాజీ కౌన్సిలర్ అమీర్, సీతారామి రెడ్డి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు నల్లబోతుల నాగరాజు, మాజీ జడ్పీటీసీ వెళ్ళాల భాస్కర్, మహిళా నాయకురాలు భోగాల లక్ష్మి నారాయణమ్మ, బీజేపీ నాయకురాలు శివ కళ్యాని, ఘంటసాల వెంకటేశ్వర్లు, జంబాపురం రామాంజనేయ రెడ్డి, ఎర్రన్న, చల్ల రాజగోపాల్ యాదవ్, పలువురు నాయకులు, పెద్దఎత్తున కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, వరద అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page