ప్రొద్దుటూరులో పీఎం ఆవాస్ యోజన గృహాల నిర్మాణం పూర్తి చేయాలని బిజేపి వినతి
- VOICE OF HERALD

- Aug 10
- 1 min read
ప్రొద్దుటూరులో పీఎం ఆవాస్ యోజన గృహాల నిర్మాణం పూర్తి చేయాలని బిజేపి వినతి

కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రొద్దుటూరు పట్టణంలో మంజూరైన సుమారు 23,000 ఇళ్లలో అనేక నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్ర రావు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేస్తూ, లబ్ధిదారులు ప్రభుత్వ నిధులతో పాటు సొంత డబ్బు కూడా ఖర్చు చేసినప్పటికీ ఇళ్లు పునాది, గోడలు, స్లాబ్ దశల్లోనే ఆగిపోయాయని తెలిపారు. పేదల సొంత ఇంటి కల సాకారం కావడం లేదని, దీనిపై కమిషనర్ స్వయంగా సంబంధిత ప్రాంతాలను సందర్శించి అసంపూర్తి ఇళ్ల వివరాలు సేకరించి వాటిని వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
అదే సమయంలో నిర్మాణం పూర్తయిన లేదా నిర్మాణంలో ఉన్న గృహ సముదాయాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా వినతిలో పేర్కొన్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, వీధి దీపాలు వంటి సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్లలేకపోతున్నారని వివరించారు. సొంత ఇంటి కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేద కుటుంబాల పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించాలని, రాజకీయాలకు అతీతంగా పేదల సంక్షేమం కోసం త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని బీజేపీ ప్రొద్దుటూరు పట్టణ శాఖ కోరింది.




Comments