top of page

మాహే రంజాన్ ఆగయా - రేపటి నుంచి ఉపవాస దీక్షలు - ప్రత్యేక ప్రార్థనలు

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 2, 2022
  • 2 min read

మాహే రంజాన్ ఆగయా - రేపటి నుంచి ఉపవాస దీక్షలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రసన్న ఆంధ్ర ఆన్లైన్ పాఠకులకు ముందుగా పవిత్ర రంజాన్ మాసం ఆరంభ శుభాకాంక్షలు

ముస్తాబైన మసీదులు :


ముస్లింల అత్యంత పవిత్ర రంజాన్‌ మాసం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహ్మద్‌ ప్రవక్త (స.అ.సం) మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మాసంలో రోజుకు ఐదు పర్యాయాలు నమాజ్‌తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పవిత్ర మాసంలో దానధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని, నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల నమ్మకం.

రేపటి నుంచి ఉపవాస దీక్షలు :

ఏపీలో ఆదివారం నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. ఈ మాసంలో ముస్లింలు తెల్లవారు జామున 4 గంటలకే ఆహారం తీసుకుంటారు. అనంతరం సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్ము కూడా మింగ కుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయస్సులో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలి వారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. ఉపవాస దీక్షలు (రోజా)సహారీతో ప్రారం భమై ఇఫ్తార్‌తో ముగుస్తాయి.

ఇఫ్తార్‌ విందులు :

ఖర్జూరపు పండుతిని దీక్ష విరమించే ముస్లింలు అనంతరం వివిధ రకాలైన రుచికరమైన వంటకాలను భుజిస్తారు. ఈ వంటకాలతో పాటు సంప్రదాయ వంట హలీమ్‌ను తయారు చేసే హోటళ్ళు ఈ నెలంతా కొనుగోలుదారులతో బిజీబిజీగా ఉంటాయి.

‘సుర్మా’తో కళ్లకు కొత్త అందం :

కళ్లకు ‘సుర్మా’ పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్‌ గానే భావిస్తారు. ప్రవక్త హజరత్‌ మహ్మద్‌ సదా సుర్మా పెట్టుకునేవారని అంటారు. కాటుక లాగే కళ్లకు రాసు కునే సుర్మా పౌడర్‌ రూపంలో ఉంటుంది. ముస్లింలు అందమైన భరిణెల్లో వీటిని దాచుకొని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్లకు పెట్టు కోవడానికి సుర్మా కూడా ఇవ్వడం సంప్రదాయం. ప్రతి నమాజుకు ముందు సంప్ర దాయం ప్రకారం ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు.

నమాజ్‌ విశిష్టత :

శుక్రవారం రోజున ముస్లింలు జుమా నమాజ్‌ చేయడం పరిపాటి. ఇక రంజాన్‌ మాసంలో మత పెద్దలతో నమాజ్‌ చేయించడం ప్రశస్తమైనది. మస్‌జిద్‌కు వెళ్ళలేనివారు ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకొని, ప్రార్థన చేసి అల్లాహ్ కృపకు పాత్రుల వుతారు. ముస్లింలు రంజాన్‌ ఆఖరు పది రోజులు ఇళ్ళు వదలి మసీదుల్లో ఉంటూ ప్రార్థనలతో ఆథ్యాత్మిక భావాన్ని అలవర్చు కుంటారు.

దానధర్మాలు :

తాము సంపాదించిన దానిలో పేదవారికి కనీసం నూటికి రూ.2.50పై, గోధుమలు, సేమియా, వస్త్రాలు, బంగారం దానం చేయాలని ఖురాన్‌ చెబుతోంది. రంజాన్‌ నెలలో ఇలా దానం చేస్తే పేద వారు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెబుతుంటారు.

ఈదుల్‌ ఫితర్‌ :

రంజాన్‌ పండుగను ఈదుర్‌ ఫితర్‌ అని అంటారు. బాల చంద్రుని దర్శించిన తరువాతి రోజు ఉదయం పండుగను జరుపుకొంటారు. పండుగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపు తారు. నమాజ్‌ అనంతరం ముస్లింలు, ముస్లిమేతరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్‌ శుభాకాంక్షలను తెలుపుకొంటారు. పండుగ రోజు షీర్‌ ఖుర్మా అనబడే తీయటి సేమియాను తప్పక వండుతారు.

రంజాన్‌ కోసం ముస్తాబైన మసీదులు

రంజాన్‌ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని ముస్లిం లు ఆయా ప్రాంతాల్లోని మసీదులను ప్రార్థనల కోసం ప్రత్యేక హంగులతో ముస్తాబు చేశారు. మసీదులు నూతన శోభతో ఉపవాస ప్రార్థనల కోసం సిద్ధమయ్యాయి. మసీదు లకు రంగులు వేయడంతో పాటు విద్యుత్‌ దీపాలంకరణ లు, మరమ్మతులు పూర్తి చేశారు. అలాగే సహారీ, ఇఫ్తారీల ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రత్యేక తారావీహ్‌ నమాజ్‌లను ఆచరించేందుకు మసీదుల్లో ఖురాన్‌ హాఫిజ్‌లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.


రంజాన్‌ ప్రత్యేకతలు :

ఈ మాసంలో సహృదయంతో, దైవభక్తితో సత్కార్యం చేసిన వ్యక్తికి ఇతర మాసాల్లో చేసిన ‘ఫరజ్‌’కి లభించే పుణ్యఫలం లభిస్తుంది. ఫరజ్‌ని ఆచరిస్తే ఇతర మాసాల్లో లభించే 70 విధులకు సమానమైన పుణ్యఫలాలు ప్రాప్తమవుతాయి.

దివ్య ఖురాన్‌ ఈ మాసంలోనే అవతరించింది.

హజరత్‌ దావూద్‌కు ఈ మాసంలోనే ‘జబూర్‌’ గ్రంథం ఇవ్వబడింది.

హజరత్‌ జిబ్రాయిల్‌ ప్రతి సంవత్సరం ఈ మాసంలో మహాప్రవక్తకు దివ్య ఖురాన్‌ను సంపూర్ణంగా వినిపించేవారు.

రోజా(ఉపవాసదీక్ష) విధిగా నిర్ణయించబడింది.

రంజాన్‌ మాసం ప్రారంభం కాగానే ప్రత్యేక ‘తారావీహ్‌’ నమాజ్‌ ఆదేశించబడింది.

వెయ్యి రాత్రుల కంటే పుణ్యప్రదమైన ‘లైలతుల్‌ఖద్ర్‌’ (షబేఖదర్‌) ఈ మాసంలోనే ఉంది.

ఆర్థిక ఆరాధన అయిన ‘జకాత్‌’ చెల్లించడం, నిరుపేదల హక్కు అయిన ‘ఫిత్రా’దానం చేయడం

దైవ ప్రసన్నత చూరగొనే మౌనవ్రతం పాటించడం ఈ నెలలోనే జరుగుతుంది. మహ్మద్‌ ప్రవక్తకు రంజాన్‌ నెలలో 21వ తేదీన ప్రవక్త పదవి లభించింది.

మొట్టమొదటి బదర్‌ ధర్మ సంగ్రామం ఈ నెలలోనే జరిగింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page