top of page

సోషల్ మీడియాలో ఆవేదన హంతకుణ్ణి పట్టించింది

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 5, 2022
  • 2 min read

గుంటూరు జిల్లాలో ఇద్దరు స్నేహితులు మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. రెండేళ్ల తర్వాత దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి..!

కన్న కొడుకు అదృశ్యంపై ఆ తల్లి చేసిన పోరాటం, చివరికి విషాదాంతం అయింది. స్నేహితుడితో కలిసి రెండేళ్ల క్రితం గోవాకు బయల్దేరిన కుమారుడు.. కనిపించకుండా పోయాడు. కొడుకు ఆచూకీ కోసం ఎంతగా ప్రయత్నించినా తెలియలేదు. నెలల తరబడి పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. చివరికి, సోషల్ మీడియాలో ఆ తల్లి పెట్టిన ఒకే ఒక్క పోస్టుతో పోలీసుల్లో కదలిక వచ్చింది. ఆ తల్లి వేదనను అర్థం చేసుకుని.. విచారించగా, దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్నేహితుడి చేతిలోనే దారుణంగా హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆ తల్లి ఆవేదనకు అంతే లేకుండా పోయింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు నగరంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఫణి కృష్ణ, అజయ్ సాయి స్నేహితులు. అజయ్ సాయికి వివాహం కాగా, ఫణి కృష్ణ అవివాహితుడు. అయితే 2020 ఫిబ్రవరి 16న స్నేహితులిద్దరూ కలిసి గోవా టూర్‌కు వెళ్తున్నట్లు ఇళ్లలో చెప్పారు. అప్పటి నుంచి స్నేహితుల ఇద్దరి జాడ దొరకలేదు. ఫణి కృష్ణ ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆయన తల్లి లలితా భవానీ కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు‌.


ఓ వైపు ఇంట్లో వాళ్లు ఇలా అవుతుండటంతో లలితా భవానీ మరింత ఆవేదనకు గురయ్యారు. తన కొడుకు ఆచూకీ చెప్పాలని అధికారుల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలోనే ఇటీవల అజయ్ సాయి హైదరాబాద్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పింది. అయినా పోలీసుల నుంచి సరైన రీతిలో స్పందన రాకపోవటంతో లలితా భవానీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో భావోద్వేగకర పోస్ట్ చేశారు.

దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. అజయ్ సాయి కుటుంబ సభ్యుల ఫోన్లపై తాడికొండ ఎస్సై వెంకటాద్రి దృష్టి పెట్టారు. దీంతో అజయ్ సాయి బండారం బయటపడింది. అజయ్ సాయి హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత అజయ్ సాయిని పట్టుకొచ్చి తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది.


2020 ఫిబ్రవరి 16వ తేదీనే ఫణి కృష్ణను హత్య చేసినట్లు అజయ్ సాయి అంగీకరించాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే ఫణి కృష్ణను హత్య చేసినట్లు అజయ్ వెల్లడించాడు. అలాగే, ఫణి కృష్ణను ఎలా హత్య చేసిన విషయాన్ని వివరించారు.

2020 ఫిబ్రవరి 16న అజయ్, ఫణి ఇద్దరూ కలిసి అమరావతి రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించారు. తర్వాత అజయ్ సాయి రాయితో ఫణి ముఖంపై దాడి చేసి చంపేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగుల బెట్టాడు. అప్పటి నుంచి అజయ్ సాయి హైదరాబాద్ పారిపోయి అక్కడే తల దాచుకున్నాడు. ఫణి కృష్ణ తల్లి లలితా భవాని సోషల్ మీడియా పోరాటంతో ఎట్టకేలకు హంతకుడుని పోలీసులు పట్టుకున్నారు. కన్నకొడుకు ఏమయ్యాడో తెలుసుకోవాలన్న తాపత్రయపడ్డ తల్లి.. రెండేళ్ల తర్వాత మరణించాడన్న విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page