top of page

ప్రధాని మోడీ విశాఖ పర్యటన.. ఏ హామీలిస్తారు? సర్వత్రా ఉత్కంఠ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 12, 2022
  • 1 min read

ప్రధాని మోడీ విశాఖ పర్యటన.. ఏ హామీలిస్తారు? సర్వత్రా ఉత్కంఠ

ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవ రోజు పర్యటన కొనసాగనుంది. విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దక్షిణ కోస్తా రైల్వేజోన్ పై కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. మోడీ సభకు హాజరవుతున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సభకు అధ్యక్షత వహిస్తారు. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. 106కోట్లతో వైర్ లెస్ కాలనీ దగ్గర జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణంకు అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. వాల్తేర్ డివిజన్ భవిష్యత్ పై క్లారిటీ వచ్చే అవకాశం వుంది.


డివిజన్ తో కూడిన రైల్వేజోన్ కోసం బలంగా వినిపిస్తున్న డిమాండ్ పై మోడీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలంటున్నారు. మోడీ బహిరంగ సభ ప్రధాన వేదికపై నలుగురికే అవకాశం ఉంది. ప్రధాని,ముఖ్యమంత్రి, గవర్నర్, రైల్వే మంత్రి మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. కేంద్ర,రాష్ట్ర మంత్రులు,ముఖ్య నాయకుల సహా 100మంది కూర్చునే విధంగా మరో వేదిక ఏర్పాటుచేశారు.


మూడో వేదికపై 60మంది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కు అవకాశం వుంది. మోడీ బహిరంగ సభ, ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి వుంది. సభకు అధ్యక్షత వహించనున్నారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. 40 నిముషాలు ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏడు నిముషాల సమయం కేటాయించారు. 10.20నిముషాలకు ప్రారంభమై 11.30కు ముగియనుంది సభ. సభ అనంతరం మోడీ హైదరాబాద్ బయలుదేరి వెళతారు.


శుక్రవారం విశాఖకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు. మధురైలో వర్షం కారణంగా విశాఖకు ఆరగంట ఆలస్యంగా చేరుకున్నారు. ప్రధాని మోడీ. బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఇది సాగింది. అనంతరం విశాఖ ఐఎన్‌ఎస్‌ చోళ గెస్ట్‌హౌస్‌కు ప్రధాని మోడీ చేరుకున్నారు. రాత్రికి అక్కడ బసచేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page