top of page

సిలిండర్‌పై రూ.200 తగ్గింపు

  • Writer: EDITOR
    EDITOR
  • Aug 29, 2023
  • 1 min read

ఎల్పీజీ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. సిలిండర్‌పై రూ.200 తగ్గింపు

వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై (LPG cylinder) రూ.200 చొప్పున తగ్గించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇంట్లో వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో రూ.1103గా ఉంది. తగ్గించిన తర్వాత రూ.903కి తగ్గనుంది. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్‌ పొందిన వారికి సబ్సిడీ కింద రూ.200 ఇస్తుండగా.. తగ్గింపుతో వారికి రూ.400 మేర ప్రయోజనం చేకూరనుంది. అంటే వారికి గ్యాస్‌ సిలిండర్ రూ.703కే లభించనుంది. అలాగే, ఉజ్వల పథకం కింద కొత్తగా మరో 75 లక్షల కొత్త వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. కొత్తగా ఇవ్వనున్న కనెక్షన్లతో కలిపితే ఈ లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరనుంది..

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పలుమార్లు సవరించిన ఆయిల్‌ కంపెనీలు.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరను మాత్రం స్థిరంగా ఉంచాయి. చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున ఆయిల్‌ కంపెనీలు పెంచాయి. మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page