ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం
- VOICE OF HERALD

- Apr 15, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు స్థానిక కొర్రపాడు రోడ్డు గోకుల్ నగర్ లో ఉన్న కామాక్షి ఆయిల్ మిల్ నందు నేటి తెల్లవారుజామున 3:30 నిమిషాల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నివాస ప్రాంతంలో ఉన్న కామాక్షి ఆయిల్ మిల్ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తోంది అనేది చుట్టుప్రక్కల వారి వాదన, ఇక్కడి మిల్లులో నూనె ఉత్పత్తి కారణంగా దుర్గంధం వ్యాపించి, చుట్టుప్రక్కల నివాస గృహాలలోకి పురుగులు చేరుతున్నాయని అప్పటి అధికారులకు తెలుపగా వారు చూసి చూడనట్లు వ్యహరించారని తెలిపారు.
తాజాగా నేటి తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుందని, దట్టమయిన పొగలు వ్యాపించటంతో గమనించిన చుట్టుప్రక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించటంతో హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎం. చంద్రుడు, రఘునాధ్, సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా మిల్ యాజమాన్య నిర్లక్ష ధోరణి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన తీరు చుట్టుప్రక్కల వారిని కలచివేసింది. యాజమాన్యం కనీసం మిల్లుకు కాపలాదారుణ్ని కూడా ఏర్పాటు చేయలేదని, అలా చేసి ఉంటే ఇంతోటి ప్రమాదం సంభవించేది కాదని వాపోయారు. వేరుశనగ పొట్టు అగ్నికి ఆహుతయ్యింది, అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలపై వివరాలు తెలియరావలసి ఉంది.
అగ్నిప్రమాదం వలన దాదాపు లక్షలలో ఆస్తి నష్టం సంభవించిందని యాజమాన్యం తెలుపగా, అగ్నిమాపక శాఖ వారు ఇరవై వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. ఇప్పటికయినా సంబంధిత అధికారులు తగు చర్యలకు ఉపక్రమించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఎంతయినా ఉంది.



Comments